Thursday, February 4, 2010

సుందుడు-ఉప సుందుడు

అనగా అనగా సుందుడు ఉపసుందుడు అనే అన్నదమ్ములిద్దరు ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ అందగాళ్ళు, చాలా బలశాలులున్నూ. ఇద్దరూ జీవితంలో పైకి రావాలనే తపన ఉన్నవాళ్ళు ; అధికారం కోసం గానీ గౌరవ మర్యాదల కోసంగానీ ఏమైనా చేసేవాళ్లు. ఇద్దరూ చాలా నియమనిష్ఠలతో బ్రహ్మ గురించి దీక్షగా తపస్సు చేశారు. అనేక సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు వారికి ప్రత్యక్షమై, వరాలు కోరుకొమ్మన్నాడు.

సుందోపసుందులు ఇద్దరూ బ్రహ్మదేవుడిని చూసి సంతోషపడ్డారు. కానీ ఉపసుందుడికి ఏం వరం అడగాలో తోచలేదు. అన్న సుందుడు ఇద్దరి తరుపునా ఆలోచించి ఇద్దరికీ చావులేకుండా ఉండాలని వరం కోరాడు. “అది సాధ్యం కాదు" అన్నాడు బ్రహ్మ. “వేరే ఏదైనా కోరండి, ఇస్తాను. ఉదాహరణకు, మిమ్మల్ని ఇతరులెవ్వరూ యుద్దంలో చంపకుండా వరం ఇవ్వగలను నేను. అయితే మీరిద్దరూ ఎప్పుడైనా కొట్టుకున్నారో, ఇద్దరూ చచ్చిపోతారు మరి ఆలోచించండి . నాయీ వరాన్ని ఎన్నడూ దురుపయోగం చెయ్యమని మాట ఇవ్వాలి అన్నాడు. సోదరులిద్దరికీ ఆ ఐడియా నచ్చింది. ' అలాగే కానిమ్మ ' న్నారు. ఇక వేరేఎవ్వరూ తమని ఓడించలేరని ఇద్దరూ పొంగిపోయారు. అయినా కొంతకాలం వరకూ వాళ్లిద్దరి ప్రవత్రనలో ఎలాంటి మార్పులు రాలేదు. తమ శక్తి గురించి ఇద్దరూ దాదాపు మరిచేపోయారు.

అయితే మెల్లగా వాళ్లిద్దరూ స్థానిక దొమ్మీల్లోను, కుస్తీలోను, రకరకాల యుద్ద విద్యల్లోనూ తమ సామర్థ్యాన్ని చూపటం మొదలెట్టారు. రాను రాను వాళ్లిద్దరి పేరు ప్రఖ్యాతలు విస్తరించాయి. ఆ దేశపు రాజు వాళ్లని ఆహ్వానించి సుందుడికి మంత్రి పదవి, ఉపసుందుడికి సేనాని పదవీ ఇచ్చాడు. వాళ్ల సాయంతో రాజు తన రాజ్యాన్ని విస్తరించి భూమండలాన్నంతా జయించాడు. అయితే త్వరలోనే ఆ రాజు సుందోపసుందుల బారిన పడాల్సి వచ్చింది. ఆ పైన సుందుడు రాజుకాగా, ఉపసుందుడు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు.

సంపద, అధికారం ఉన్నవారు నీతిమంతులుగా ఉండటం కష్టం. సుందోపసుందులిద్దరూ ఇక రాక్షసులే అయ్యారు. తమకు నచ్చినది ఏదీ ఎవరిదగ్గర ఉన్నా దోచుకోవటం మొదలుపెట్టారు వాళ్ళు. రాజ్యాలు, బంగారం, మణిమాణిక్యాలు, స్త్రీలు వేటికీ భద్రత అనేది లేకుండా పోయింది. వాళ్లు దుశ్చర్యలకు బలైన వాళ్లంతా బ్రహ్మదేవుడి శరణుజొచ్చారు.

బ్రహ్మదేవుడు విష్ణుమూర్తినీ, శివుడినీ అడిగాడు- ఏమైనా చేయమని. అందరు దేవతలూ కలిసి ఆలోచించారు: "సుందోపసుందులను ఇతరులెవ్వరూ ఓడించలేరు. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటే తప్ప, ఈ భూమికి వాళ్ల భారం తగ్గదు". బాగా ఆలోచించిన విష్ణుమూర్తి, దేవతలందరి సాయంతో "తిలోత్తమ" అనే అందగత్తెను సృష్టించాడు. ఆమె శరీరంలోని ప్రతి కణంలోను-(నువ్వుగింజంత భాగంలో కూడా-) అందం తొణికిసలాడేట్లు తయారు చేశారు వాళ్ళు. ఆపైన ఆమెకు ఏం చేయాలో బోధించి పంపారు.

సుందోపసుందుల రాజధానిని చేరుకున్న తిలోత్తమ కొద్ది రోజుల వ్యవధిలోనే ఉపసుందుడి ఇల్లు చేరింది. రాజ్యంలోని ప్రతి దుర్మార్గుడూ ఆమె సౌందర్యాన్నే గానం చేయటం మొదలెట్టాడు. ఆమె తన సొంతం అయినందుకు ఉపసుందుడు ఎంతగానో గర్వపడ్డాడు. అయితే అతని సంతోషం ఎంతోకాలం నిలువలేదు. రాజభవనం నుండి సుందుడు కబురంపాడు- తిలోత్తమను తన పరం చేయమని. తను పెద్దవాడు గనుకనూ, రాజు గనుకనూ ఆమెపై తనదే అధికారమన్నాడు. అనుకున్నట్లుగానే, ఉపసుందుడు అందుకు ఒప్పుకోలేదు. తమ్ముని ఇంటికి వచ్చి చూసిన సుందుడిక ఆగలేక పోయాడు. అన్నాదమ్ముల పోట్లాట మెల్లగా మొదలై తారస్థాయికి చేరుకున్నది.

తిలోత్తమ వాళ్లిద్దరినీ శాంతపరచలేదు. తన అందాన్ని ఎరగా చూపి, ఆమె ఇద్దరినీ వేరువేరుగా ఊరించింది. ఇద్దరినీ ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పింది. పోలాడుతున్న సుందోపసుందులు ఒళ్లు మరిచిపోయారు. ఆయుధాలు బయటికి తీశారు. బాహా బాహీలో ఇద్దరూ చచ్చిపోయారు. దుర్మార్గుల పీడ విరగడ అయిందని అన్ని లోకాల జనులూ ఊపిరి పీల్చుకొని పండగ చేసుకున్నారు.

వచ్చిన పని అయిపోయినందున తిలోత్తమ స్వర్గం చేరుకున్నది!

No comments:

Post a Comment