Thursday, February 4, 2010

గురు నానక్ కథ

నానక్ తండ్రి కాలూరాం ఒక కిరాణా వ్యాపారి. పట్టణంలో పేరుగాంచిన దుకాణాల్లో వారి దుకాణం ఒకటి. పంట కాలంలో ఆయన రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి, దాన్ని నిలువ చేసి, సంవత్సరమంతా వినియోగదారులకు అమ్మేవాడు.

ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడి, పంటలు పండక, మార్కెట్లో ధాన్యపు కొరత ఏర్పడింది. ప్రభుత్వం వారు తమ గిడ్డంగుల్ని తెరిచి, ఉన్న ధాన్యాన్ని అందరికీ పంచేందుకు గానూ చౌకధరల దుకాణాల వ్యవస్థ నెలకొల్పారు.

కాలూరాం గారికి అలాంటి చౌకధరల దుకాణం ఒకటి ఇచ్చారు. అప్పుడు నానక్ వయస్సు సుమారు 15 సంవత్సరాలు.

ఒకరోజున గిరాకీలు మరీ ఎక్కువమంది ఉంటే, తండ్రికి సాయంగా నానక్ గూడా దుకాణపు పనిలోకి దిగాడు- లావాదేవీల్ని నమోదు చేసుకొని, గిరాకీలకు ధాన్యం కొలిచి ఇవ్వటం నానక్ పని.

దుకాణంలో వ్రేలాడదీసిన తక్కెడ చిన్నదికావటంతో, ప్రతివారికీ అనేక సార్లు తూచి పోయవలసి వస్తున్నది. తూచి పోసిన ప్రతిసారీ నానక్ పెద్దగా అది ఎన్నోదో అరచి చెప్తున్నాడు- ఏక్..దో...తీన్..అని.

ఒకసారి అల తూచిపోస్తూండగా అంకె పెద్దది అయింది- వన్...గ్యారహ్..బారహ్..ఆపైఒన తేరహ్ వచ్చింది. గట్టిగా "తేరా" అని అరిచిన నానక్ కు "తేరా" కు ఉన్న రెండో అర్థం గుర్తుకొచ్చింది. “తేరా" అంటే "నీది" అని అర్థం- “భగవంతుడిది" అని అర్థం.

ఇక ఆయనకు 'సర్వమూ ఆ భగవంతుడిదే' అని గుర్తుకొచ్చింది. “అంతా నీదే- తేరా" అని అర్థం. ఇక ఆయనకు 'సర్వం ఆ భగవంతుడిదే' అని గుర్తుకొచ్చింది. “అంతా నీదే-తేరా" దగ్గర ఆయన లెక్క ఆగిపోయింది.

తర్వాతంతా నానక్ ధాన్యాన్ని తూచి పోస్తూనే వచ్చాడు. కానీ ఆయన హృదయంలో లెక్కమాత్రం 'తేరా' దగ్గర ఆగిపోయింది. సర్వం మరచిపోయి, నానక్ ధాన్యం మొత్తాన్నీ ఇచ్చేశాడు- ఏమీ రాసుకోకుండానే.

“తేరా" అని అరచిన ఆ క్షణంలోనే నానక్ కు జ్ఞానం ఉదయించింది. పూర్తిగా పండిన పండు ఇక చెట్టును అంటుకొని ఉండదు- నేలరాలుతుంది. ఆ పైన దానిని ఒక్క క్షణం సేపు కూడా ఆపి ఉంచలేదు చెట్టు. పండుకూడా చెట్టుతో తన ఎడబాటును వెనుకకు మరల్చలేదు. నానక్ అనుభవం కూడా అటువంటిదే దాని అయి ఉండవచ్చు- అనేక జన్మలుగా ఆయన చేస్తున్న యాత్ర నాటితో ముగిసింది.
(మూలం: పర్తాప్ అగర్వాల్)

No comments:

Post a Comment