పరమశివుని అర్ధాంగి ఉమాదేవికి ఎవరో చెప్పారు- జనక మరణ చక్రం గురించీ, సృష్టి ప్రారంభమైననాటినుండి ఈ చక్రం నిరంతరంగా ఎలా తిరుగుతూ ఉన్నదీనీ. ఆమెకు అదంతా గొప్పగా అనిపించింది- దానిగురించి ఇంకా తెలుసుకోవాలనే కోరిక కలిగింది.
ఒకనాడు ఆమె పరమశివుడిని అడిగింది- “నేను ఇప్పటివరకూ ఎన్ని జన్మలెత్తానో చెప్పగలరా, మీరు?” అని.
శివుడన్నాడు- “ఓ., వేల జన్మలు-అనేకానేక రూపాలు!" అన్నాడు శివుడు.
“ఇక ముందు కూడా నేను మళ్లీ మళ్లీ జన్మిస్తానంటారా?” అడిగింది ఉమ.
“బహుశ:- పుట్టవలసి రావచ్చు" అన్నాడు శివుడు.
“మీరు కూడా, మరి, అలా పుడుతూ, గిడుతూ ఉంటారా?” అన్నది ఉమ.
“ఉహు- లేదు- నేను ఆ నియమానికి ఆవల ఉన్నాను" జవాబిచ్చాడు శివుడు.
ఉమాదేవికి సరిగా అర్థం కాలేదు. స్పష్టీకరణ కోరింది శివుడిని. కానీ- "ఇది వివరించాలంటే చాలా సమయం కావాలి. విషయం కొంచెం క్లిష్టం కూడాను. అందుకని, నువ్వు దాన్ని అందుకునేందుకు సిద్దంగా ఉన్నప్పుడు- మళ్లీ ఎప్పుడైనా చెబుతాను లె"మ్మన్నాడు సదాశివుడు.
కొన్ని వారాలు గడిచాయి- 'జనన మరణ చక్రం' గురించి మరిచిపోలేదు ఉమాదేవి. శివుడు మాత్రం దాని ఊసే ఎత్తటం లేదు.
ఒకనాటి సాయంత్రం, శివుడు కొంచెం ఖాళీగా కనిపించినప్పుడు, ఉమాదేవి జనన మరణాల గురించి మళ్ళీ గుర్తు చేసింది. ఇక తప్పేట్లు లేదని, శివుడు వివరించటం మొదలుపెట్టాడు. మెడ క్రింద ఒక దిండును ఉంచుకొని, ఉమాదేవి మెల్లగా కుర్చీ వెనక్కి వాలింది. శరీరాన్ని సుఖంగా ఉంచి, శివుడు చెప్పేది వింటున్నది. ఆలోగా ఒక పిల్లి అక్కడికి వచ్చి, ఆమె కాళ్లను రాసుకొని ముడుచుకు కూర్చున్నది. శివుడు తన దారిన తాను చెప్పుకుంటూ పోతున్నాడు:
"జడమైన ఈ ప్రపంచంలో ఒక్క కణంగా ఉద్భవించింది ప్రాణం. ఆ కణంలోని జీవంలో జ్ఞానం జాగృతమైనది. ఆ జ్ఞానం నుండి మనసు ఉత్పన్నమైనది. కణపు రక్షణ కోసం శరీరం నిర్మితమైంది. ఆ ప్రక్రియలో అవయవాలు, ఇంద్రియాలు ఏర్పడ్డాయి. వాటికి- పరిసరాలకు మధ్య జరిగిన చర్యలతో ప్రతి చర్యలు మొదలైనాయి. వాటి నుండి ఇష్టాలు- అయిష్టాలు తయారయ్యాయి. ఆ యిష్టాలు - అయిష్టాల నుండి తృష్ణ, కోరికలు, భయాలు ఉత్ప్న్నమైనాయి. ఇవన్నీ కలగలసినప్పుడు, వీటన్నిటి సమాహారం నుండీ జననం కలుగుతున్నది. ఆ పైన వార్ధ్యక్యం, వ్యాధి, మరణం, దు:ఖం ఇవన్నీ జననాన్ని అనుసరించి వస్తాయి....”
-ఉమాదేవి ఇవన్నీ వింటూ నిద్రలోకి జారుకున్నది. ఈ సూక్ష్మ వివరాలన్నీ ఆమెకు అవసరం లేనివిగా తోచాయి. కానీ పిల్లి మాత్రం వింటున్నది- అందుకని శివుడు కొనసాగించాడు-
“ఈ జనన-మరణ చక్రాన్ని నిరంతరంగా తిప్పుతూండే యాంత్రిక శక్తి 'తృష్ణ '- కోరికే! మన కోరికలు, భయాలు మన మనసుల్నిండా ఆవరించుకొని, 'నిజమైన మనల్ని ' నిద్రపుచ్చుతాయి. పరిపూర్ణమైన వాస్తవంలో మనం కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రం చూస్తాం. చూసి, ఆ చిన్న ముక్కతో నిరంతరం ప్రవహించే ఊహాలోకాన్నే సృష్టించుకుంటాం. ఈ చక్రంనుండి విడివడాలంటే మనం కొంచెం ఉన్నతి చెంది, మన కోరికల్ని, భయాల్ని 'కల' గా గుర్తించాలి. అప్పుడిక పునర్జన్మ ఉండదు..”
వింటున్న పిల్లికి జన్మరాహిత్యం కల్గిందట!
ఉమాదేవి నిద్ర మాత్రం కొనసాగిందట!!
Showing posts with label పర్తాప్ అగర్వాల్ శివుడు-పార్వతి. Show all posts
Showing posts with label పర్తాప్ అగర్వాల్ శివుడు-పార్వతి. Show all posts
Thursday, February 4, 2010
Subscribe to:
Posts (Atom)
